24/06/2026
మన్యం మళ్లీ 'మంచాన'పడింది !
శ్రీకాకుళం జిల్లా సీతంపేట, ఒరిస్సా సరిహద్దు లోని పాతపట్నం మొదలు గోదావరి జిల్లాలోని రంపచోడవరం దాకా విస్తరించి ఉన్న ఏజెన్సీ ప్రాంతం ఎప్పుడూ ఏదో ఒక సమస్య తో బాధపడుతోనే ఉంటుంది.. ఆదివాసీలు, అడవి బిడ్డలకు ఆవాసమైన ఈ ప్రాంతం ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది.. మలేరియా, క్షయ వంటి ప్రాణాంతక వ్యాధులు ఇక్కడి జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. ప్రతి ఏడాది వేసవి రోజుల్లో ఇక్కడ వేల సంఖ్యలో అంటువ్యాధుల బారిన పడిన గిరిజనులు సకాలంలో వైద్యం అందక అతలాకుతలం అవుతుండడం పరిపాటిగా మారింది.. మలేరియా మరణాల గురించి మీడియాలో విస్తృత ప్రచారం జరగడమూ రివాజుగా మారింది.. ఇలాంటి సమయంలోనే అధికారులు కాస్త హడావుడి చేస్తున్నారు.. హెల్త్ క్యాంపులు నిర్వహించి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తున్నారు.. కాలెండర్లో మరో ఏడాది మారుతుంది.. మళ్లీ మామూలే.. ఈ సారి మలేరియా రోగుల సంఖ్య లక్షల్లో ఉంటుంది.. సాధారణంగా వేసవి ముగిసి తొలకరి ప్రారంభం అయ్యాక అంటువ్యాధులు ప్రబలుతాయి.. ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఇక చెప్పేదేముంది ? మన్య ప్రాంతమంతా మంచం ఎక్కినట్టుగా మారుతుంది.. ప్రతి ఇంట్లో కనీసం ఒకరిద్దరు మలేరియా సోకిన రోగులు వుంటున్నారంటే అతిశయోక్తి కాదు..కొన్నేళ్ల క్రితం అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి దివంగత కొణిజేటి రోశయ్య చొరవతో ఏజెన్సీ ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించి యుద్ధప్రాతిపదికన వైద్య సేవలు అందించేందుకు కృషి చేశారు.. కొన్నాళ్ల తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.. గత ప్రభుత్వం 'నాడూ- నేడూ' పేరుతో విద్యా,వైద్య శాలల్ని కొంతమేరకు మెరుగు పరిచినా, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ప్రాధామ్యాలలో మార్పులు కారణంగా కొనసాగింపు కొరవడుతోంది.. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ, సిబ్బంది కొరత కారణంగా సమస్యలతో కునారిల్లుతున్నాయి.. ఒకవేళ సిబ్బందిని నియమించినా, మైదాన ప్రాంతాల నుంచి వెళ్లి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండి పనిచేయడానికి ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.. డాక్టరు పట్టా చేతికి వచ్చాక, కనీసం రెండు సంవత్సరాలు మారుమూల, గిరిజన ప్రాంతాల్లో పనిచేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ అవి అమలుకు నోచుకోవడం లేదు..రాజకీయ నాయకుల ప్రమేయంతో కొందరు వైద్యులు ఇటువంటి 'నిబంధనల' నుంచి ఎలాగో బయట పడుతున్నారు.. మరోవైపు గిరిజన సమగ్రాభివృద్ధికి కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏ లు కూడా రకరకాల కారణాల వల్ల నిర్వీర్యం అవిపోతున్నాయి.. ప్రోజెక్టు ఆఫీసర్ (పీఓ ) విచక్షణ మీద ఈ సంస్థల పనితీరు ఆధారపడి ఉంటుందన్నది బహిరంగ రహస్యం..
ఎందుకింత దుర్భర పరిస్థితులు ?
రాజ్యాంగం లోని ఐదో షెడ్యూల్ మేరకు గుర్తింపు పొందిన ఏజెన్సీ ప్రాంతాన్ని'షెడ్యూల్ ప్రాంతం'గా పరిగణిస్తారు.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం ఏడు 'సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థలు' (ITDA)లను ఏర్పాటు చేశారు.. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ సంస్థలకు ప్రత్యేక నిధులు సమకూరతాయి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో సీతంపేట, గుమ్మలక్ష్మీ పురం, పార్వతీపురం, పాడేరు, చింతపల్లి, కృష్ణ దేవి పట్నం, రంపచోడవరం ప్రాంతాల్లో ఐటీడీఏ కేంద్రాలు నెలకొల్పారు.. భద్రాచలం లో కూడా ఐటీడీఏ ఉన్నప్పటికీ, రాష్ట్ర విభజన తరువాత అది తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్ళింది.. ఇక ఆంధ్రప్రదేశ్ లోని ఈ ఏడు సంస్థల పరిధిలో దాదాపు ముప్పయ్ లక్షల గిరిజన జనాభా నివసిస్తున్నారు.. అన్ని కేంద్రాలు, జిల్లాలతో కలిపి ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం 160 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHC) నెలకొల్పారు.. ముందే ప్రస్తావించినట్టు,పేరుకే ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ, సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్టూ కనిపిస్తోంది.. కొన్ని కేంద్రాల్లో అయితే కేవలం 'ఆయాలు' లేదా ఏఎన్ఎమ్(Auxiliary Nurse Midwife)లు అన్నీ తామే అయి విధులు నిర్వహిస్తున్నారు.. రోగులకు మందులు సమకూర్చేందుకు నియమించిన'ఫార్మాసిస్టులు' మచ్చుకైనా కానరారు.. అసలు మందులు ఉంటేగా రోగులకు పంపిణీ చేయడానికి ?..ఏ వ్యాధికైనా పారాసిటమల్ మాత్రలు ఇచ్చిపంపుతారు..ఒకవేళ వైద్యులు వున్నా మైదాన ప్రాంతాల నుంచి వారానికో, పక్షానికో ఒక్కసారి వచ్చి 'చూసి'వెళ్ళిపోతారు.. వీరు సౌకర్యాల గురించి కూడా పెద్దగా పట్టించుకోరు.. ఒకవేళ సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తే తాము ఇక్కడే ఉండి పనిచేయాల్సి వస్తుందని వాళ్ళ'భయం'..లే(ని)మి సాకుతో రాకుండా వుండవొచ్చు ననేది వాళ్ళ ఎత్తుగడ గా కనిపిస్తోంది..గిరిజనులు పరిశుభ్రత పాటించక పోవడం వల్లనే అంటువ్యాధులు సోకుతున్నాయని వార్షిక నివేదికల్లో రాసి చేతులు 'కడుక్కొంటున్న' వైద్యులు కూడా ఉన్నారంటే, గిరిజనుల పట్ల వారికి ఎంతటి చిన్నచూపు వుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఎక్కువ మంది గిరిజనులు పౌష్టికాహార లోపం వల్లనే ,రోగనిరోధక శక్తి నశించి ఎక్కువ గా వ్యాధుల బారిన పడుతున్నారని వీళ్ళు ఒప్పుకోరు.. కొందరు గిరిజనులు జీవనాధారంగా భావించే మేకలు, పందులు, కోళ్ల వంటి పెంపుడు జంతువులతో 'సహజీవనం' చేస్తుంటారు.. తాము నివసించే చిన్న పాటి గుడిసెలు, పాకల పక్కనే ఈ జంతువులను ఉంచుకుంటారు.. దూరంగా ఉంచితే పులులు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు తమ పెంపుడు జంతువులను ఎత్తుకెళ్తాయన్న భయంతోనే వాళ్లిలా జాగ్రత్త పడుతుంటారని ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విద్యార్థులు నిర్వహించిన క్షేత్ర స్థాయి అధ్యయనంలో వెల్లడైంది..దీని వల్ల కూడా కొంత అపరిశుభ్రత పరిస్థితులు నెలకొంటున్న మాట నిజమే అయినా, అటువంటి దుర్భర పరిస్థితుల నుంచి వారిని రక్షించాల్సిన బాధ్యత ఎవరు తీసుకోవాలి ? ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు ఏంచేస్తున్నట్టు ? గిరిజనులు అంటే కేవలం ఓటు బ్యాంకులేనా ?
ఎన్నాళ్లీ 'డోలీ' మోతల వెతలు ?
ఒకపక్క ఐటీడీఏ వంటి కేంద్ర సంస్థలు, రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలోని జిల్లా, మండల అధికారులు, గ్రామ పంచాయతీలు పనిచేస్తున్నా, ఏజెన్సీ ప్రాంతంలోని చాలా గ్రామాలు, కుగ్రామాలకు సరైన రహదారులు లేకపోవడం గమనార్హం.. ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తితే, ముఖ్యంగా కష్టతరమైన కాన్పులు కేసుల విషయంలో చాలాసార్లు సమయానికి వైద్యం అందక కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటలు కూడా సంభవిస్తున్నాయి.. పోనీ పట్టణ ప్రాంతాల్లోని ఆస్పత్రికి తీసుకెళ్లి, వైద్యం అందించాలని ప్రయత్నించినా, అంబులెన్స్లు వచ్చేందుకు కూడా రహదారులే లేని పరిస్థితులు నెలకొనివున్నాయి.. గత్యంతరం లేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు పది,పదిహేను మైళ్ళ దూరం'డోలీ'ల్లో మోసుకుకెళ్లాల్సి వస్తోంది.. కంబళిలోపల ఊపిరి ఆడక కొందరు, కడుపులో బిడ్డ అడ్డం తిరిగి మరి కొందరు నిండు గర్భిణీ స్త్రీలు ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట సంఘటనలు తరచూ చూస్తున్నాం, వింటున్నాం.. ఆ మధ్య పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణం పనులకు ప్రారంభోత్సవం చేశారు.. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.. కానీ అవి కార్యరూపం దాల్చక పోవడం గమనార్హం.. ఇక మలేరియా లాంటి అంటు వ్యాధులు వ్యాపిస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.. ఈ సీజన్లో ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే వేలాది మంది మలేరియా తో బాధపడుతున్నాని సమాచారం.. గత ఆరుమాసాల్లో మన్యం జిల్లాలో దాదాపు రెండు లక్షల మలేరియా కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోంది.. స్థానిక ప్రాధమిక వైద్య కేంద్రాల్లో ఏ ఎన్ ఎమ్ లే వైద్య సేవలు అందించేందుకు సాహసిస్తున్నారు.. వ్యాధి నిర్దారణ కోసం పరీక్షలు నిర్వహించే ' ర్యాపిడ్ డయాగ్ని స్టిక్ టెస్ట్'(ఆర్డీటీ) కిట్లు సరిపడా అందుబాటులో లేకపోవడంతో , ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి.. మలేరియాకి తోడు విషజ్వరాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.. నివారణ చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి.. జనవరి నుంచి ఇప్పటిదా దాదాపు మూడు వందల మందికి వ్యాధి నిర్ధారణ జరిగినట్లు జిల్లా ఆరోగ్య అధికారులు చెబుతున్నా, ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది.. జిల్లాలోని మొత్తం పదిహేను మండలాల్లో పరిస్థితులు విషమంగా ఉన్నట్లు క్షేత్ర స్థాయి అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.. సాలూరు, పాలకొండ నియోజకవర్గాల పరిధిలో ని గ్రామాల్లో ప్రతి ఇంటిలో ఒకరిద్దరు మలేరియా వ్యాధితో బాధపడుతున్నారు.. ఇక సీతంపేట ఐటీడీఏ పరిధిలోనూ పరిస్థితులు బాగాలేవు.. చాలా గ్రామాల్లో మలేరియా వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది..ఆర్డీటీ కిట్లు అందుబాటులో లేకపోవడంతో వ్యాధి నిర్ధారణ ఆలస్యం అవుతోందనేది బహిరంగ రహస్యమే.. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇలాకాలో కూడా పరిస్థితి ఏమాత్రం బాగాలేదన్నది వాస్తవం.. మారుమూల కుగ్రామాలకు వెళ్లేందుకు రహదారి సౌకర్యాలు లేకపోవడంతో 'డోలీ' లే గతవుతున్నాయని,ఫలితంగా సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా నమోదవుతున్నాయని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు..
ఉత్సవాలు'ఊపిరి' నిలుపుతాయా ?
ఇదిలా వుండగా, గిరిజన ప్రాంతాల్లో సహజ సుందరంగా ఉన్న ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో టూరిజం శాఖ ఏటా అరకు ఉత్సవాలు నిర్వహిస్తోంది.. అభివృద్ధి కి దూరంగా ఉన్న గిరిజన సంస్కృతిని బయట ప్రపంచానికి తెలియ చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆహ్వానించ పరిణామం అని కొందరు భావించావొచ్చు.. సంక్రాంతి సీజన్లో గిరిజన ప్రాంతాల్లో నిర్వహించే ఉత్సవాలకు పర్యాటకులు అశేషoగా వస్తున్నారు.. కానీ, వేసవి సీజన్లో గిరిజన ప్రాంతాల్లో ప్రబలే వ్యాధుల సంతతి ఏంటి ? మన్యం మొత్తం 'మంచం పట్టినట్టు' జనం రోగాలతో ముసుగులు కప్పుకుని మూలుగు తుంటే పట్టించుకునే నాధుడు ఎవరు ?విద్య, ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రత్యేక నిధుల కేటాయింపు జరుగుతున్నా, అవి కాగితాలకే పరిమితం కావడం ఆశ్చర్యంగా లేదూ ? ఆఖరికి గిరిజన ఆశ్రమ పాఠశాలలు,వాటికి అనుబంధంగా ఉన్న సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి కూడా అధ్వాన్నంగా వున్నట్టు ఆమధ్య అధికారులు హైకోర్టుకు సమర్పించిన వివేదికలో అంగీకరించారు అనంటే, వాస్తవ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో తెలుస్తోంది.. ముఖ్యంగా కలుషిత తాగునీటి వల్లనే డయేరియా, మలేరియా వంటి వ్యాధులు తరచూ సంభవిస్తున్నాయని అధ్యయనాల వల్ల తెలుస్తోంది.. శుభ్రమైన తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు మరమ్మతులకు గురైనా, ఫిల్టర్లు గడువు తీరిపోయినా పట్టించుకోవడం లేదని తరచూ విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారు ..కానీ పట్టించుకొనే దెవరు ? కలుషిత నీరు తాగడం వల్ల విద్యార్థినులు రోగాల బారిన పడి చావు బతుకుల మధ్య విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రిలో చేరుతుండడం గురించి తరచూ వింటూనే ఉన్నాం..ఏజెన్సీ ప్రాంతంలోని వేలాది గ్రామాల్లో దోమలు నివారించేందుకు ద్రావణాన్ని పిచికారి చేశారు.. తద్వారా మలేరియా మహమ్మారి ప్రబలకుండా ఉంటుందని భావించారు.. అయినా మలేరియా ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు సరికదా, రోజురోజుకూ కేసులు మరింత పెరిగాయి.. దీనికి ప్రధాన కారణం ఏజెన్సీ ప్రాంతంలో ని వేలాది గ్రామాలకు కలుషిత నీరు అందుతోంది.. పైపెచ్చు వర్షాలకు నీరు మరింత కలుషితం అవుతోంది.. మంచినీరు సరఫరా చేసే ప్రధాన (ట్యాoకులు) వనరులను వారానికోసారి శుభ్రం చేయిస్తున్నామని అధికారులు చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి..అందుకే మలేరియా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.. దీనికి తోడు ఆర్డీటీ కిట్లు లక్షల్లో కావాల్సి ఉండగా, వేలల్లో కూడా రావట్లేదని గిరిజన సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.. ప్రతి ఏటా ఇదే సీజన్లో మలేరియా, విషజ్వరాలు విజృంభిస్తాయని తెలిసినా అధికారులు అప్రమత్తంగా లేకపోవడం వల్లనే విషమ పరిస్థితులు సంభవిస్తున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ప్రమాదం ముంచుకొచ్చాక హడావుడి చేసేకంటే ముందే జాగ్రత్తలు పాటిస్తే కొంతలో కొంత మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు.."మేమూ మనుషులమే.. మాకూ ప్రాథమిక హక్కులున్నాయి.. ఓటు హక్కులూ ఉన్నాయి.. ఎన్నికల సమయంలో మినహా ఆపదకాలంలో మేమెందుకు గుర్తుకు రావడం లేదు ?" అని ఏజెన్సీలో నివసించే ఆదివాసీలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు ?
వ్యాస కర్త
ప్రొఫెసర్ పీటా బాబీ వర్ధన్,
జర్నలిజం పూర్వపు విభాగాధిపతి & డీన్,
అంధ్ర విశ్వవిద్యాలయం,
9393100566.